Thursday, September 25, 2008

పద్యం పండగ చేసుకుంది

[ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలర్పించిన వేలాది నేపాల్ వీరుల కోసం]

మానవ హక్కులతో
తలపడీ భంగపడీ
ఒక కిరీటం ముక్క ముక్కలైంది

యువకుల రక్తంతో ఆటలాడి
ఒక సింహాసనం
మట్టి పెళ్ళల్లో కూరుకుపోయింది

నిజంగా
నా పద్యం ఇప్పుడు పండగా చేసుకుంటోది
నా వాక్యం ఇప్పుడు
తన పై తానే రంగులు జల్లుకుంటోది

మంచుకొండల మధ్య
ఎగిసిపడుతున్న అగ్నితరంగాలను కౌగలించుకుని
నా మనసు ఇప్పుడు
ప్రజాస్వామ్యం పాట పాడుతోంది

జీన్ ప్యాంటూ టీషర్టూ తొడుక్కొని
నా అక్శరాలు ఇప్పుడు
హిమలయాల వీధుల్లో
ప్రజాస్వామ్య పతాకాన్ని
మోసుకుంటూ తిరుగుతున్నాయి

ఒక రాజప్రసాదం మీద
కాలం వీథి కుక్కయి
ఒంటేలు పోస్తోంది
జ్ఞానేంద్రుడి కళ్ళలో చరిత్ర మణ్చుకత్తై
దిగబడుతోంది

ఆ మనోహర దృశ్యాన్ని
శీతల శిఖరాల తుహిన ఫలకాలమీద
సూర్యుడు వేయిరంగుల చిత్రకావ్యంగా రచిస్తున్నాడు.

స్వెటర్లు వేసుకుని మఫ్లర్లు చుట్టుకుని
నా కవితలు ఇప్పుడు
ఆ హిమవన్నగ సామ్రాజ్యంలో
విప్లవ గుడారాల ముందు పహరా కాస్తున్నయ్.

ఆ తేయాకు తోటల్లో
ఆ బాస్మతీ పంటభూముల సువాసనల్లో
ఆ చిన్ని కళ్ళ చిట్టిముక్కల
నేపాల్ పిల్లల కలల్లో
నా కలం ఇప్పిడు షికార్లు కొడుతోంది

ఆహా ఇప్పుడు నా పద్యం
కరిగి కరిగి నీరవుతున్న రాచరికపు శీతశైలాన్ని చూసి
అట్టహాసంగా నవ్వుతోంది.

No comments: